మహబూబాబాద్, ఆగస్టు 23 : దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తొర్రూరు మున్సిపాలిటీలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఆసరా పెన్షన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ముందుగా 3016 దివ్యాంగుల ఆసరా పెన్షన్స్ 4016కు పెంచుతూ మంజూరు చేసిన పత్రాలను, కల్యాణ లక్ష్మి చెక్కులను కలెక్టర్ శశాంకతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
ఆసరా పెన్షన్ల అందజేయుటలో దేశానికే తెలంగాణ రాష్ట్రo ఆదర్శంగా నిలిచిందని మంత్రి తెలిపారు. ఎవరు పెంచమని అడగకముందే అన్నీ తానై అందజేస్తున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపాలన్నారు. దివ్యాంగులకు 100 నాలుగు చక్రాల మోటర్ వాహనాలను త్వరలో అందజేయనున్నట్లు, అందుకు 13 కోట్ల 2 లక్షల రూపాయలు అవుతుందని, గతంలో ఎర్రబెల్లి ట్రస్ట్ నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.
తొర్రూర్లో 108 అత్యవసర సేవలకు అంబులెన్స్ ను కూడా అందజేసామని, 4 కోట్ల రూపాయలతో 20వేల మందికి నియోజకవర్గంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 6 కోట్ల రూపాయలతో కుట్టు మిషన్ల శిక్షణ చేపట్టి భోజన సౌకర్యాలను కల్పిస్తూ కుట్టు మిషన్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారికి సెప్టెంబర్ 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పాలకుర్తిలో రాష్ట్రంలో చూడని అభివృద్ధిని చేసి చూపిస్తానని మరొకసారి తనను మనసారా దీవించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, పెద్ద వంగర ఎంపీపీ ఈదురి రాజేశ్వరి, దేవస్థాన కమిటీ చైర్మన్ శర్మ, డిఆర్డిఒ సన్యాసయ్య, అడిషనల్ డిఆర్డిఒ వెంకట్, ఆర్డీవో నరసింహారావు, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.