జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి టీ-2 క్వార్టర్స్లో నివసిస్తున్న కార్మికుల కుటుంబాలకు మంచినీటి సౌకర్యార్థం కోసం ప్రతి ఇంటికి 1000 లీటర్ల కెపాసిటీ గల సింటెక్స్ ట్యాంకులు నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. క్వార్టర్స్లో నివసిస్తున్న వారికి మౌలిక వసతులు కల్పించి, సమస్య లను తీర్చాలని కోరుతూ ఆయన గురువారం టీబీజీకేఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్లో సింగరేణి డైరెక్టర్ (పా)కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం గండ్ర మాట్లాడుతూ సింగరేణి టీ-2 క్వార్టర్స్లో వృద్ధులు, చిన్న పిల్లలు పైఅంతస్తులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని, వెంటనే పటిష్టమైన మెట్లు నిర్మించాలన్నారు. అదేవిధంగా దెబ్బతిన్న డ్రైనేజీని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. క్వార్టర్స్లో నివసిస్తున్న వారి భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, సింగరేణి అధికారులు చొరవ తీసుకోని అటవీ శాఖ అనుమతులను త్వరగా పూర్తి చేసి నిలిచిపోయిన ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.
1000 క్వార్టర్స్, రామప్ప కాలనీ ప్రాంతాల్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సాగర్రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, కేంద్ర కమిటీ జాయింట్ సెక్రటరీ రత్నం అవినాష్రెడ్డి, సెక్రటరీ బాసనపెల్లి కుమారస్వామి, సెంట్రల్ కమిటీ మెంబర్, వార్డు మెంబర్ కొండి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.