హనుమకొండ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకించినందుకే తెలంగాణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే చట్టాల్లోని మతలబును వివరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన హనుమకొండలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతలు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని ధర్నాలు చేయాలని, ఏ ఒక్క రైతు మీటర్లు బిగించాలని కోరుకున్నా మీ.. ధర్నాలకు అర్థం ఉంటుందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాల్లోని విషయాలు బయటపడిన రోజు బీజేపీ జెండా పట్టినోళ్లే ఉరికిస్తారన్నారు.
రైతులను రెచ్చగొట్టి చలికాచుకుంటున్నరు
ఓ వైపు ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్రానికి నోటీసులు జారీ చేస్తుంటే.. రైతులను రెచ్చగొట్టి బీజేపీ నేతలు చలిమంటలు కాచుకుంటున్నారని మంత్రి విమర్శించారు. మరో వైపు పంజాబ్లో సాగయ్యే ధాన్యాన్ని కేంద్రం కొంటుందని.. మరి తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. తెలంగాణలోని రైతులు రైతులు కారా.. ఇక్కడిది పంట కాదా? ఈ వివక్ష దేనికంటూ ధ్వజమెత్తారు. వరి కొనాల్సింది, కొన్న ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంచాల్సింది కేంద్రమేనన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి రాష్ట్రాలపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. రైతులను అయోమయానికి గురి చేయకుండా యాసంగి వడ్లను కొంటారా? లేదా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ నిలువలు పేరుకుపోయాయంటూనే ఓ పక్క బాయిల్డ్ రైస్ను కొనమని కేంద్రం ద్వారా లేఖలు రాయిస్తూ.. మరో వైపు యాసంగిలో వరి పంటనే వేయాలని రైతులను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయరంగ అభివృద్ధికి నిరంతర కృషి
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయరంగాన్ని, పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని అందరూ విశ్లేషించుకోవాలని హితవు పలికారు. 30 ఏళ్లుగా ప్రధాన వనరుగా ఉన్న ఎస్సారెస్పీని పట్టించుకోలేదని, కాకతీయ కాలువ శిథిలావస్థకు చేరిందన్నారు. బాబ్లీ నిర్మాణంతో ఎస్సారెస్పీకి వరద కరువైందన్నారు. పంటలకు నీరందించేందుకు అనతికాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. సమృద్ధిగా సాగునీరు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల అభివృద్ధి జరిగిందని, చెక్డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు అండగా నిలిచామన్నారు. వానాకాలంలో 1.41కోట్ల ఎకరాల్లో వరి సాగైందన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, మేయర్ సుధారాణి, వీ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.