హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాపరిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ధాన్యం సేకరణతో పాటు నూకలు ఎవరు తింటారో తేల్చుకుందామని బీజేపీ నాయకులకు దయాకర్ రావు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా, కించపరిచేలా మాట్లాడిన పీయూష్ గోయల్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు లేకుండా కేంద్రానికి వంత పాడే ధోరణిని మానుకోవాలని సూచించారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి వైభవం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారంటే కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల విధానాలే కారణమని స్పష్టం చేశారు. పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు వలసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. మా నాన్న బతికుంటే కేసీఆర్ విధానాలతో బతికిన వ్యవసాయాన్ని చూసి సంతోషించే వారని దయాకర్ రావు గుర్తు చేశారు.
తెలంగాణ రైతులను పట్టించుకోకుండా కేంద్రానికి వంత పాడుతున్న బీజేపీ నేతలను ఢిల్లీకి తరమాలని దయాకర్ రావు సూచించారు. వడ్లు కొనిపించే దాకా బీజేపీ నేతలను గ్రామాల్లో అడుగుపెట్టనివ్వొద్దని చెప్పారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు సిగ్గుండాలి. వ్యవసాయ చట్టాలపై రైతులు కేంద్రం మెడలు వంచినట్టే.. తెలంగాణ రైతులు కూడా ఏకమై ధాన్యం కొనేదాకా ఉద్యమిస్తారని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.