హైదరాబాద్ : ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలకు గానూ ఇప్పటి వరకు 12,672 వైకుంఠధామాలు, 12,737 డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 147 గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఈ ఏడాది అక్టోబర్ వరకు పూర్తి చేశాం. వైకుంఠధామాల కోసం రూ. వెయ్యి కోట్ల 547 కోట్లు, డంపింగ్ యార్డుల కోసం రూ. 319 కోట్లు ఖర్చు చేశామన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. గ్రామాలను బాగు చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. నిధులను ఏ రూపంలో వాడుకుంటున్నామో అవగాహన తెచ్చుకోవాలి. కానీ రాష్ట్రం నిధులా? కేంద్రం నిధులా? అన్న ప్రశ్న ఉత్పన్నం కావొద్దన్నారు. వైకుంఠధామాలను ఒక టెంపుల్ మాదిరిగా అద్భుతంగా తీర్చిదిద్దాం. మిషన్ భగీరథ నీళ్లను వైకుంఠధామాలకు అందిస్తున్నాం. పల్లె ప్రకృతి వనాలను అందంగా తయారు చేశామన్నారు. ప్రతి ఊరిలో నర్సరీ ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన మొక్కలను అందిస్తున్నాం. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ను కేటాయించామన్నారు. నరేగా నిధులను అద్భుతంగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు అని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.