హైదరాబాద్ : దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన సంస్థ స్త్రీనిధి మాత్రమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్త్రీనిధి 9వ సర్వసభ్య సమావేశాన్ని మంత్రి దయాకర్ రావు బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్త్రీ నిధి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 50 కోట్ల చెక్కును అందజేశారు. మండల, పట్టణ సమఖ్యాలకు రూ. 47 కోట్ల చెక్కును అందజేశారు. స్త్రీ నిధి వార్షిక నివేదికను మంత్రి ఆవిష్కరించారు. చెల్లింపు పద్ధతిని మరింత సులభం, వేగవంతం చేయడానికి వీలుగా ఆన్లైన్ పద్ధతిని మంత్రి ప్రారంభించారు. స్త్రీనిధి డిజిటల్ పద్ధతిని మంత్రి వీక్షించారు. ఈ సేవలను మంత్రి పరిశీలించి, దేశంలోనే తొలిసారిగా స్త్రీ నిధి సంస్థ వినియోగిస్తున్న ఈ సైన్ సేవలను ప్రారంభించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో ఇంత గొప్పగా, స్త్రీనిధిని తీర్చిదిద్దిన రాష్ట్ర మహిళా సభ్యులందరికీ, స్త్రీనిధి, సెర్ప్, మెప్మా అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు! పేదరిక నిర్మూలనలో భాగంగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, స్త్రీనిధిని సమర్ధవంతంగా, డ్వాక్రా సంఘాలకు చేర్చి, వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది దాకా… సెర్ప్, మెప్మా, డీఆర్డీవోలకు 9వ జనరల్ బాడీ మీటింగ్ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
రూ. 32 కోట్లతో ప్రారంభమై, 10 ఏళ్లలో రూ. 5,300 కోట్లకు సంస్థను చేర్చిన మా అక్కా చెల్లెళ్ళు అందరినీ అభినందిస్తున్నాను. స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు 3 లక్షల 97 వేల మహిళ సంఘాలలోని 26 లక్షల 92 వేల మంది సభ్యులకు రూ. 14 వేల 339 కోట్లను రుణాలుగా ఇచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ. 3 వేల కోట్లను రుణాలుగా ఇచ్చాం. ఇంతగా రుణాలను బ్యాంకులు కూడా ఇవ్వలేక పోతున్నాయి. అంత ఘనత సాధించిన స్త్రీ నిధి సంస్థను అభినందిస్తున్నానని మంత్రి అన్నారు.
తెలంగాణ రాక ముందు అంటే 2014 మార్చి వరకు కేవలం రూ. 742 కోట్లు మాత్రమే ఇస్తే, తెలంగాణ వచ్చాక రూ. 14 వేల 339 కోట్లు ఇచ్చాం. అంటే గతంతో పోలిస్తే, రూ. 13 వేల 596 కోట్లు అదనం. ఇదంతా ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైంది. సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
స్త్రీనిధిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి సభ్యులందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. స్త్రీనిధి సేవలను పొంది, మీ ఆదాయాన్ని పెంచుకొని మరింత ఆర్థికాభివృద్దిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందు కొరకు నా నుండి, ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెప్మా ఎండీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల కమిషనర్ సత్యనారాయణ, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, అధ్యక్షురాలు జి. ఇందిర, ఉపాధ్యక్షురాలు పి. రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, 19 మంది స్త్రినిధి డైరెక్టర్లు, 600 మంది మండల, పట్టణ సమాఖ్యల అధ్యక్షులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.