హైదరాబాద్: ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకొంటున్న సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమన్నారు. క్రీస్తు బాటలో నడిస్తే ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవని, యుద్ధాలకు ఆస్కారం లేదని తెలిపారు. అన్ని మతాల సారం మానవత్వమేనని, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే అన్న ఏసుక్రీస్తు ప్రభోదం మేరకు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ ముఖ్య పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ అన్నారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.