హనుమకొండ: రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోగి శుభాకాంక్షలు తెలిపారు. పాతను వదిలి కొత్తకు భోగి మంటలు స్వాగతం పలుకుతాయన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుందని, తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయన్నారు. బంధువులు, స్నేహితులతో పల్లెల్లో.. పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు.
ఇండ్ల ముందు రంగవల్లులు, రథాల ముగ్గులు, గడపలకు పసుపు- కుకుమలు, దర్వాజలకు మామిడి తోరణాలు, పిల్లల తలపై రేగిపండ్లు వేస్తూ ఇచ్చే దీవెనలు, ఆకాశాన్ని వర్ణశోభితం చేసే భోగి నిజంగా భోగ భాగ్యాలు తెచ్చే పండుగ అని తెలిపారు. ఈ పండగను ప్రజలంతా కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వెళ్లడమే సంక్రాంతి అని.. దక్షిణ భారతంలో పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఉత్తరాయణం చేస్తూ దేశానికి కొత్త క్రాంతి తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుణాత్మకమైన మార్పు కోసం వస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావంతో ఈ ఏడాది నుంచి సంతోషకరమైన, సంపన్నమైన దేశ నిర్మాణం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.