యాదగిరిగుట్ట: ఎవరెన్ని చేసినా, ప్రతిపక్షాలు తలకిందులుగా పొర్లుదండాలు పెట్టినా, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని (CM KCR) మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ప్రజలు సుఖ శాంతులతో ప్రశాంతంగా జీవించాలంటే, కేసీఆర్ మరోసారి సీఎం కావాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఆయన యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. భగవంతుడి చల్లని చూపు, కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని ప్రార్థించానన్నారు. లక్ష్మీనర్సింహ స్వామి దీవెనలు అందరిపైనా ఉంటాయని, మహిమాన్వితమైన దేవాలయానికి మెరుగులు దిద్ది, నభూతో న భవిష్యతి అన్న చందంగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, పార్టీ, ప్రభుత్వంపై దేవుడి దీవెనలుంటాయన్నారు.
శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు మెచ్చారని, ఇంత జనరంజకంగా, ప్రజోపయోగంగా పరిపాలన చేసిన సీఎంలు గతంలో రాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మళ్లీ రావాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించాలని తాను కోరకున్నట్లు తెలిపారు.