హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల తగ్గించారు. ఈ నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా దరఖాస్తులు చేసుకొనే వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 31 నాటికి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ, అర్హులైన అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 11 నుండి 30 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఈ-సేవ లేదా మీ-సేవ ద్వారా ఈ దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమీషనర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం 57 ఏండ్లు, ఆపై వయస్సు కలిగిన వాళ్లంతా వెంటనే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపిచ్చారు.
ఆసరా పెన్షన్లలో భాగంగా కనీస వయస్సును 57 ఏండ్లకు తగ్గించిన మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొందని ఆయన చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 11 నుండి 30 లోగా ఈ-సేవ, మీ-సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.
అక్టోబర్ 30 లోగా దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని తెలిపారు. జీఓ 75 ప్రకారం పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాలని వివరించారు. కాగా, ఈ దరఖాస్తులు చేసినందుకు ఈ-సేవ, మీ-సేవల్లో ఎటువంటి సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుమును కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీచేసినట్లు ఎర్రబెల్లి వెల్లడించారు.
అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఆసరా పెన్షన్లు కూడా దానిలో భాగమేనని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో వృద్దులకు రూ. 2016/-, దివ్యాంగులకు రూ. 3016/- పెన్షన్ను కేసీఆర్ అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.