HomeTelanganaMinister Errabelli Dayakar Rao That Brs Will Win The Next Election And Take Power Again
మళ్లీ బీఆర్ఎస్దే అధికారం
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపొంది మళ్లీ అధికారం చేపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
బీజేపీకి రోజులు దగ్గర పడ్డయ్
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల
దేశమంతటా బీజేపీకి కౌంట్ డౌన్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
పలుచోట్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు
నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, మే 16: వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపొంది మళ్లీ అధికారం చేపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కార్యకర్తలు, తమ కుటుంబ సభ్యులతో హాజరై సందడిగా గడిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన సమ్మేళనంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్, బండి సంజయ్లు మూర్ఖులు, దుర్మార్గులని, అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వాళ్ల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉన్నదని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిలిండర్కు దండం పెట్టి నిరసన
కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్ని సరుకుల ధరలు పెంచుతున్నదని, ఆ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ పార్టీ జెండాను ఎగుర వేశారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులు పట్టించుకోకుండా ఏటా సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండటంతో ఆత్మీయ సమ్మేళనంలో మహిళలు గ్యాస్ సిలిండర్కు పూలదండ వేసి నిరసన తెలిపారు. ఇక బీజేపీ పాలన వద్దని దండం పెట్టారు. మరికొందరు మహిళలు సిలిండర్ల చుట్టూ బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో సిలిండర్తో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
బీజేపీకి కౌంట్ డౌన్
దేశమంతటా బీజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ప్రధాని మోదీని దేశ ప్రజలందరూ ఛీకొడుతున్నారని పేర్కొన్నారు. నిరుపేదలంతా మోదీని పిరం ప్రధానిగా అభివర్ణిస్తున్నట్టు ఎద్దేవా చేశారు. అనేక ఏండ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
అభివృద్ధిలో మనమే టాప్
రైతుబంధు అధ్యక్షుడు, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో ఉన్నదని అన్నారు. అబద్ధాలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని సూచించారు. 2014కు ముందు ప్రసుత్తం ఉన్న తీరును తెలంగాణ ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు. ప్రజలు ఆలోచించి సీఎం కేసీఆర్కు తిరిగి మరోమారు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.