Minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ను కాపాడుకుంటేనే ప్రజలకు లాభం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాదాపురం, అప్పిరెడ్డి పల్లె గ్రామాలకు కలిపి పడమటి తండాలో, సింగరాజు పల్లె, నీర్మాల గ్రామాలకు కలిపి సింగరాజు పల్లె తుమ్మ గార్డెన్లో వేర్వేరుగా జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తిలో ప్రజలు మూడుసార్లు బిడ్డగా భావించి ఎన్నుకున్నారని.. ఈ ఆదరణను మరిచిపోలేనన్నారు. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు అన్నిరంగాల్లో అభివృద్ధి చేడయమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలోనే పాలకుర్తిని అన్నిరంగాల్లోనే ఆదర్శంగా నిలుపుతానన్నారు. ప్రజలకు తలవంపులు తెచ్చే పనులేవీ తాను చేయనన్నారు. నియోజకవర్గంలోని 20వేల మంది మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
కేంద్రం పెంచుతున్న ధరలతో ప్రజలపై భారపడుతుందని మంత్రి అన్నారు. 70 సంవత్సరాలు పాలిచిన పార్టీలు అభివృద్ధి చేస్తే.. ప్రస్తుతం ఇంత చేయాల్సి వచ్చేదా? అని ప్రశ్నించారు. పత్రిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చేయలేని పనులు ఇక్కడ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటివారిని నమ్మితే నట్టేట మునిగినట్టేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.500 మించి ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతుబంధు తరహాలో పెట్టుబడికి నిధులు ఇస్తున్నారా? నిలదీశారు. ఆయా పార్టీల పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికలు, కోట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తెలంగాణలో ఏడుగంటలకు దిక్కులేదని, ఇవాళ 24గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు మిగిస్తామని కేంద్రం చెబితే.. ప్రాణమున్నంత వరకు మీటర్ల పెట్టనివ్వనన్న మహానేత కేసీఆర్ అని కొనియాడారు. ఏటా రూ.10,500కోట్లకుపైగా రైతుల తరఫున విద్యుత్ సంస్థలకు చెల్లించి.. ఉచితంగా కరెంటు ఇస్తున్నారన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రూ.200 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి.. రూ.1200 చేశారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి.. నేడు ప్రజలపై పెనుభారం మోపారన్నారు. పొన్నాల లక్ష్మయ్య పొంకనాలే తప్ప మంత్రిగా ఉండి.. ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ను కాపాడుకుంటేనే.. మన్ని కాపాడుతాడని, మనకు లాభం జరుగుతుందన్నారు. అన్ని సందర్భాల్లో కేసీఆర్కు అండగా నిలబడాలని, రాష్ట్రాన్ని తెచ్చిన నేతను కడుపులో పెట్టుకొని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని శ్రేణులకు చదివి వినిపించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి మంత్రి భోజనాలు చేశారు.