టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు కుట్రలు పన్నిన బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. అధికార దాహంతో అంధకారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వానికి తెరలేపిందని అన్నారు. కానీ బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని స్పష్టం చేశారు. బీజేపీ ప్రలోభాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొంగబోరని తెలిపారు.
బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా.. వారి కుట్రను భగ్నం చేసిన ఎమ్మెల్యేలకు ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్తో ఢిల్లీలో పీఠం కదులుతుందని బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు. కేసీఆర్కు ఆదరణ పెరుగుతుందనే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతోందని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు కానివ్వమని.. కొట్లాడైనా కాపాడుకుంటామని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించవద్దని హితవుపలికారు. అధికార దాహంతో ఉన్న బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.