టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి బీజేపీ బొక్కబోర్లాపడింది. ఈ క్రమంలో బీజేపీ కుట్రలు కుతంత్రాలపై టీఆర్ఎస్ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్పందించారు. బీజేపీ కుట్రలు తమపై చెల్లవని.. టీఆర్ఎస్ శాసనసభ్యులు ఎటువంటి ప్రలోభాలకు లొంగబోరని స్పష్టం చేశారు. చుండూరులో వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్రలో శిఖండిలాంటి షిండేలను పెట్టుకుని శివసేన ప్రభుత్వాన్ని కూల్చినట్లుగానే.. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు. మాపై ఈడీలను ప్రయోగిస్తూ మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ల ప్రయత్నాలు మేం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాం. ఇలాంటి ప్రలోభాలు కొత్తేం కాదు. గతంలో చంద్రబాబు.. రేవంత్ రెడ్డిని ముందు పెట్టి కుట్రలు చేశారు. అప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాటిని చేధించారు. మేము ఏ ప్రలోభాలకు లొంగేది లేదు. మేం ప్రజల నుంచి వచ్చాం. మాకు ఉద్యమ నేపథ్యం ఉంది. అందుకే మీ కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ప్రజలపై చెల్లవు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. తెలంగాణలో వాళ్ల ఆటలు సాగవు. కేసీఆర్ మాకు దేవుడితో సమానం. అందుకే మా శాసనసభ్యులే బీజేపీ కుట్రలకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టారు.
ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను మీ కుట్రలు కుతంత్రాలతో కూలదోసే ప్రయత్నాలను ఇకనైనా ఆపాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తాన్నా. ఇటువంటి కుట్రలు చేస్తే ప్రజలే మీకు సరైన బుద్ది చెబుతారు. కాంట్రాక్టర్ ముసుగులో వచ్చిన రాజ్గోపాల్ రెడ్డికి 20వేల కోట్లు ఇచ్చి మీ వైపు తిప్పుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మీవైపు వచ్చే ప్రసక్తే లేదు. మునుగోడులో బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతున్నారు.. కాచుకోని ఉండండి. దేశవ్యా్ప్తంగా బీఆర్ఎస్ ప్రభావం కనిపిస్తుంది. మునుగోడు ఎన్నికల తర్వాత మా అధినేత కేసీఆర్ దేశమంతటా తిరిగి మీరు చేసే కుట్రలను బయటపెడతారు. ప్రజల తరఫున పోరాడి మీ కుట్రలు ఆపుతాం. అని మీడియాతో తెలిపారు.