హైదరాబాద్: అభివృద్ధిలో అమెరికాతో (America) హైదరాబాద్ (Hyderabad) పోటీపడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు సొంతూరికి రమ్మంటే వచ్చేవాళ్లు కాదని చెప్పారు. తెలంగాణ (Telangana) వచ్చిన తర్వాత పరిస్థిలో మార్పు వచ్చిందని, ఇప్పుడు వద్దన్నా మనళ్లు, మనవరాళ్లు వచ్చివెళ్తున్నారని తెలిపారు. ఊర్లలో 24 గంటల కరెంటు, మంచి నీళ్లు రావడమే దీనికి కారణమని వెల్లడించారు. ఇంతటి అభివృద్ధి కారణమైన సీఎం కేసీఆర్ను (CM KCR) మనం కాపాడుకోవాలని, టీఆర్ఎస్ హాట్రిక్ విజయం ఖాయమని చెప్పారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న తానా (TANA) మహాసభల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నేడు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. జరగాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉందని, దీనికి ఎన్ఆర్ఐల సహకారం కూడా ఉండాలని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.
గత 25 ఏండ్లుగా తాను తానా సభలకు హాజరవుతున్నాని చెప్పారు. ఈసారి మంత్రిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇలా అందరినీ కలవడం, ఒకే కుటుంబంలా గడపడానికి మించిన ఆనందం ఎక్కడా దొరకదన్నారు. తెలుగువారంతా ఎక్కడున్నా ఒక్కటేనని వెల్లడించారు. ఎక్కడున్నా మన పనితనంతో ఉన్న ప్రాంతాన్ని, స్వదేశాన్ని, రాష్ట్రాన్ని, సొంతూరు అభివృద్ధికి ఛోదక శక్తులుగా ఉన్నామని చెప్పారు. దేశ సంపద పెంపులో, నిర్మాణంలో ముందున్నామని తెలిపారు.