నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 28: సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం శివారులో, హరిపిరాల గ్రామ శివారులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. 24 గంటల కరెంటు ఇస్తుండటంతో ఓర్వలేని కేంద్రం ఉచిత కరెంటును నిలిపివేస్తే రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు ఇస్తానని చెప్పినా సీఎం కేసీఆర్ తిరస్కరించి రైతుల పక్షాన నిలిచినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభయమిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల ఆత్మీయ సమ్మేళనం కందూరు స్టేజీ సమీపంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పాలమూరును అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే కొందరు మళ్లీ తెలంగాణను ఆగం చేయడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సదస్సులో గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు తప్ప రూపాయి లాభం లేదని, తొమ్మిదేండ్ల పాలనలో మోదీ సర్కారు దేశాన్ని ఆర్థికంగా అధోగతి పట్టించిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కొప్పుల మాట్లాడుతూ.. గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుడిని కోలుకోలేని దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఈ సమ్మేళనంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదేండ్లలోనే అరవై ఏండ్ల అభివృద్ధి జరిగిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ఒక్క గులాబీ జెండానే కారణమని, కేసీఆర్ లేకపోతే రాష్ట్ర ఏర్పాటు అయ్యేది కాదని పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది వలస వస్తే తెలంగాణ అతిథ్యం ఇస్తున్నదని తెలిపారు. నారా చంద్రబాబునాయుడు తొత్తు, పిట్టల దొర పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి సరిపోనోడు ఫెయిల్యూర్ తెలంగాణ అనడంలో అర్థం లేదని మండిపడ్డారు. నీ పాత బాస్ చంద్రబాబు, కొత్త బాస్ రాహుల్గాంధీ తెలంగాణాను నాశనం చేశారని ఆరోపించారు.