Minister Dayakar Rao | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లాలో శనివారం వడగళ్ల వానతో పంటలు దెబ్బతినగా ఆదివారం మంత్రి క్షేత్రస్థాయి పంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టానికి సంబంధించి విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కొద్ది రోజుల కిందట ప్రకృతి బీభత్సానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు.
స్వయంగా సీఎం కేసీఆర్ ఆయా చోట్ల పర్యటించి, రైతుల పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పించారన్నారు. పరిహారంపై గతంలో ఎక్కడా ఎన్నడూ ఇవ్వనంత ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ నష్టాన్ని రైతులు మరిచిపోక ముందే మరోసారి వడగళ్ల, అకాల వర్షాలు కురవడం దురదృష్టకమన్నారు. ప్రకృతి ప్రకోపానికి తప్పుకోవడం తప్ప చేసేది ఏమీ లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. దాంతో కొంత వరకు నష్టాలు తగ్గాయన్నారు.
ఇంకా పంట చేతికి వచ్చే ముందే వర్షాలు కురవడంతో రైతులు విలవిలలాడుతున్నారన్నారు. వారిని పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, స్వయంగా రైతు అని, అన్నదాతల కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు. పంట నష్టంపై మరోసారి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.