హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొనసాగుతున్న 3,622 పంచాయతీల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి శనివారం జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారంలో లక్ష్యాన్ని అధిగమించాలని, పంచాయతీరాజ్ శాఖకు 6.7 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటివరకు 2.25 కోట్ల మేరకు నాటినట్టు ఎర్రబెల్లి వివరించారు. కొత్తగా వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేయాలని, 50 వేల చోట్ల హార్టికల్చర్ ప్లాంటేషన్ చేయాలన్న శాఖ లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి వల్లే స్వచ్ఛ సర్వేక్షణ్లో సత్తా
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం వల్లే స్వచ్ఛ సర్వేక్షణ్లో తెలంగాణ జాతీయస్థాయిలో సత్తా చాటిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో సత్ఫలితాలు సాధించిన జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలతో రాష్ట్రం తనకు ఎదురులేదని నిరూపించిందని స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన నాలుగింటిలో రెండు క్యాటగిరీల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. హై అచీవర్స్ క్యాటగిరీలో జనగామ, కామారెడ్డి జిల్లాలు, అచీవర్స్ క్యాటగిరీలో హనుమకొండ, ఆసిఫాబాద్ జిల్లాలు అగ్రభాగాన నిలిచాయని, ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.