తొర్రూరు, జూన్ 13: దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఆయన నాయకత్వం వహిస్తే తెలంగాణ మాదిరే దేశం అభివృద్ధి సాధిస్తుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016 ఆసరా పింఛన్, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్, దళితబంధు, రైతుబీమా, రైతుబంధు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతో స్వచ్ఛమైన మంచినీటి సరఫరా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల వారు అభినందిస్తూ ఇప్పుడిప్పుడే వారి రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. దూరదృష్టి, తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్కు ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉన్నదని.. దేశం కేసీఆర్ వంటి నేత కోసం ఎదురు చూస్తున్నదని స్పష్టంచేశారు.