రెంజల్, మార్చి 29 : నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. సరిహద్దులో నిఘాను కట్టుదిట్టం చేసింది. ముఖ్య పట్టణాల్లో లాక్డౌన్ విధించిన అధికారులు నాందెడ్ జిల్లా పరిధిలోని 16 తాలూకా గ్రామాలను అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి, మహారాష్ట్రలోని బెల్లూర్, బాలాపూర్, బన్నేల్లి, ఖండ్గావ్ శివారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 4వరకు లాక్ డౌన్ విధించారు. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూను విధిస్తున్నట్లు నాందెడ్ జిల్లా ఎస్పీ ప్రమోద్ షావాలే ప్రకటించారు. నాందెడ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం సాయంత్రం వరకు 19 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. 1098 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ కూడా చదవండి..
గ్రామాన్నంతా తెల్లదుప్పటిలా కప్పేసిన మంచు..!