నల్లగొండ : కల్లాలు కట్టారని రూ.150కోట్లు ఖర్చు చేశారని తెలంగాణకు రావాల్సిన రూ.703కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నిలిపివేసిందని, రైతుల కోసం కల్లాలు కట్టడం తప్పా ? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గతంలో జరిగిన పనులు, భవిష్యత్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షించి.. సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ మిషన్ భగీరథలో నల్లగొండ జిల్లాకు భారీగా నిధులు కేటాయించి.. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశామని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ట్రాక్టర్పై ఒక్కో గ్రామంలో 20 నుంచి 25లక్షల వరకు సర్పంచులు సంపాదిస్తున్నారని, ట్రాక్టర్లతో గ్రామ పంచాయతీ ఆదాయం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు.
కొన్నిచోట్ల సర్పంచులు ఆదాయాన్ని మళ్లించి కిస్తీలకు డబ్బులు రావడం లేదని అంటున్నారని.. కొంత మంది కావాలని కిస్తీలు కట్టలేకపోతున్నామని బదనాం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని ఖండిస్తూ.. వాస్తవ ఆదాయాన్ని బయటపెట్టాలన్నారు. పలు పంచాయతీల్లో పొడి చెత్త, తడిచెత్తను వేర్వేరు చేసి ఎరువు తయారీ చేయడం ద్వారా లక్షల్లో ఆదాయం సమకూరుతుందన్నారు. సర్పంచ్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. నివేదిక మొత్తం తెప్పించి ఆదాయం ఎంత వస్తుందో చూపించాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సైతం నిధులు కేటాయిస్తున్నామన్నారు.
గత ఏడు నెలలుగా కేంద్రం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, ఎందుకు నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఇదేమని అడిగితే వంకలు పెట్టి తప్పించుకుంటుందన్నారు. కేంద్రం ఉపాధిహామీ నిధుల విడుదల ఆపి వేసిందని, పంచాయతీరాజ్ రోరడ్లకు పాత రేట్ల మీద పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. అందుకే ఇప్పుడు రేట్లు పెంచామన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకు పీఎంజీఎస్వై కింద రూ.295.65కోట్లు నల్లగొండకు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే మంజూరైన పనులు మార్చిలోపు పూర్తి చేయాలన్నారు.
నల్గొండ జిల్లాకు రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు మంజూరయ్యాయన్నారు.
మిషన్ భగీరథ కింద కూడా రాష్ట్రంలో ఈ జిల్లాలోనే అత్యధికంగా రూ.6వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. నల్గొండలో 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వీటిలో పాతవి 1150 ఉండగా.. కొత్తగా 550 ఏర్పాటయ్యయాయన్నారు. ప్రతి పంచాయతీకి రోడ్లు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. 731 పంచాయతీలకు భవనాలు కావాలని, ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పంచాయతీలు ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలతో పోటీపడుతున్నాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. వలస వెళ్లిన వారంతా పల్లెలకు తిరిగి వస్తున్నారన్నారు. సర్పంచులు నిజాయితీగా పని చేసిన చోట పంచాయతీల ఆదాయం పెరిగిందనిన్నారు. కొంత మంది డ్రామాలు ఆడుతూ ప్రభుత్వం చేసే మంచి పనులకు మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద మంచి పనులు చేపడుతున్నారని గుర్తించి.. కుట్ర పన్ని ఆ పథకాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిధిలో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత, జడ్పీ చైర్పర్సన్లు బండ నరేందర్ రెడ్డి, దీపికా యుగంధర్, సందీప్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్ నాయక్, ఎన్ భాస్కర్ రావు, గాదరి కిశోర్ కుమార్, శానంపుడి సైది రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్య నారాయణ, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.