చండూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరులో ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు డబ్బు మదంతో మునుగోడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓట్లు వేయాలన్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ను చూస్తే బీజేపీ నేతల వెన్నులో వణుకుపుడుతున్నదని వెల్లడించారు. కేసీఆర్ను నిలువరించే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్ను రూపుమాపారని వెల్లడించారు. అభివృద్ధి చేశాం కాబట్టే తాము ప్రజలను ఓట్లడుగుతున్నామని చెప్పారు. గత ఉపఎన్నికల్లో గెలిచిన నాగార్జునసాగర్, హుజూర్నగర్లో ఊహకందని విధంగా అభివృద్ధి చేశామన్నారు. కావాలంటే బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి చూడాలన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. చౌటుప్పల్లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న జేపీ నడ్డా హామీ ఏమైందని నిలదీశారు.