హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేని విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నదని రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు పేర్కొన్నారు. కేంద్రం నిధులు నిలిపివేసినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తూనే ఉన్నదని చెప్పారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షను చూపుతున్నదని విమర్శించారు. ఈ విషయంలో రాష్ర్టాన్ని బద్నాం చేయడం తగదని పేర్కొన్నారు.
15వ ఆర్థిక సంఘం బకాయిలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిశారు. శనివారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేయడంతో స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. మరోవైపు చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆ నిధులు విడుదల చేసేలా కేంద్రంపై వత్తిడి తేవాలని మంత్రికి చెప్పామని వివరించారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య, బూడిద రామ్రెడ్డి, ఉదయశ్రీ, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతమైన ఆలోచనతో పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతిని ఇక్కడ అమలు చేస్తున్నారు. పంచాయతీలకు రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు వస్తున్నాయి. అయితే కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులు రావడంలేదు. కొందరు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం సరికాదు. మేము సర్పంచ్లుగా ఉన్న సమయంలో గ్రామాల్లో ఎప్పుడూ జరగనన్ని పనులు జరుగుతున్నాయి. మాకు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంది. గ్రామాల్లో చిరకాలం నిలిచే పోయే పనులు జరిగాయి.
– ఉదయ శ్రీ, సర్పంచ్, నంది వనపర్తి గ్రామం, రంగారెడ్డి జిల్లా