వరంగల్: తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao) అన్నారు. అమిత్ షా మాటలన్నీ అబద్ధాలేనని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. వరంగల్లో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. ఏ హామీ నెరవేర్చారో చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కృషిని పార్లమెంటులో కేంద్రం పొగిడిందన్నారు.
అమిత్ షా బోగస్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కేంద్రం నీచమైన కుట్రలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎగనామం పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ది త్యాగాల కుటుంబమని ఎర్రబెల్లి అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అబద్దాల యూనివర్సిటీకి అమిత్ షా వీసీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యారని చెప్పారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని సుదర్శన్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ బీజేపీ బెగ్గింగ్ రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. పాదయాత్రలో బండి సంజయ్ని ప్రజలు నిలదీశారని వెల్లడించారు. సన్యాసుల సంఘానికి అధ్యక్షుడు బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.