హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను తామే ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. టెక్స్టైల్ పార్క్ను ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాటుచేశారని స్పష్టంచేశారు. మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఎర్రబెల్లి శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోదీకి ఈడీ, సీబీఐ అండగా ఉంటే తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కేవలం కేసీఆర్ను తిట్టడానికి, ఇంత సమయం, అంత ఖర్చు చేసి, వరంగల్ దాకా వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ఏమి చేశారో..? వరంగల్కు ఏమి చేశారో చెప్పకుండా కేసీఆర్ని తిడతారా? అంటూ నిలదీశారు. తెలంగాణ పట్ల విషాన్ని, విద్వేషాన్ని నింపుకుని ప్రధాని మాట్లాడారని పేర్కొన్నారు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.