Minister Dayakar Rao | ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు మహిళలే ముందుండి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, కొడకండ్లలో రాష్ట్రంలోనే తొలిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, తొలి విడత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మిషన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న మహిళల అనుభవాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బాగుంటేనే కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు.
తనకు మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులు బాగా తెలుసునన్నారు. అనాదిగా మహిళలు పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశానని, అందుకే కుట్టు శిక్షణ, మిషన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రూ.5.10కోట్లతో ర్య్క్రమాన్ని పాలకుర్తిలో ప్రయోగాత్మకంగా చేపట్టామని, 10వేల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యమన్నారు. తొలి విడతగా 3వేలమంది శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వెయ్యి మంది శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ఒక్కో గ్రామంలో 100 మంది మహిళలు శిక్షణ తీసుకోవాలని, శిక్షణ పూర్తయిన వాళ్లకు జూలై నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్క్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.
ఉద్యోగాలకు వెళ్లలేని వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తామని, మహిళలను సైనికుల్లా తయారవ్వాలన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే మంచి మనుషులు మహిళలని, వారి కోసమే తాను ఇదంతా చేస్తున్నానన్నారు. నా కోసం, సీఎం కేసీఆర్ కోసం నిలబడాలన్నారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు అండగా నిలుస్తూ.. ప్రభుత్వాన్ని విమర్శించే వారికి మహిళలే ముందుండి బుద్ధి చెప్పాలన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడే వాళ్లను ఎదురించాలన్నారు. తనను గెలిపించిన అందరి రుణం తీర్చుకుంటానన్నారు.