హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఓట్ల కోసం రేవంత్రెడ్డి చెప్పే బ్రోకర్ మాటలను ప్రజలు నమ్మరని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జీవితాంతం తెలంగాణ ఆశ, శ్వాసగా తపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ పేరును ఉచ్చరించటానికి కూడా రేవంత్రెడ్డికి అర్హతలేని స్పష్టంచేశారు. అబద్ధాలకు, అసత్యాలకు పుట్టిన అక్రమ సంతానమే రేవంత్రెడ్డి అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ లాంటి వెధవలు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సోమవారం ఆయన ఎన్నిక ధృవపత్రం అందుకొన్న అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట (వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం)లో రేవంత్రెడ్డి మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని ధ్వజమెత్తారు. జయశంకర్ సార్ బతికి ఉన్నప్పుడుకానీ, ఆయన చనిపోయినప్పుడుకానీ, ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగాకానీ ఆ మహనీయుణ్ణి రేవంత్రెడ్డి ఏనాడూ కనీసం స్మరించిన ధాఖలా లేదని, అలాంటి దౌర్భాగ్యుడికి ఇప్పుడు జయశంకర్ సార్ పేరును ఉచ్చరించే అర్హతే లేదని స్పష్టంచేశారు.
రేవంత్రెడ్డి అవినీతి బిడ్డ
రేవంత్రెడ్డి అసత్యాలకు, అబద్ధాలకు పుట్టిన అక్రమ సంతానం రేవంత్ అని పల్లా రాజేశ్వర్రెడ్డి నిప్పులు చెరిగారు. రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించి రాజ్యాన్ని ఏలాలనుకొంటే కుదరదని తేల్చిచెప్పారు. రాజకీయాల్లో కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టే నేతలను ప్రజలు నేలకేసి ఈడ్చికొడతారని స్పష్టం చేశారు. కులాల పేరుతో రాజకీయాలు చేసే రేవంత్రెడ్డిని రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్గా నియమించుకోవటమే కాంగ్రెస్ పార్టీకి పట్టిన దుర్గతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు, అన్ని జిల్లాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సహజీవన సమభావనకు టీఆర్ఎస్ వేదికగా నిలుస్తున్నదని చెప్పారు. ఆత్మహత్యలకు, సహజ మరణాలకు తేడా తెలియని వెధవ రేవంత్ అని ధ్వజమెత్తారు.
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 2014 నుంచి తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్వయంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రేవంత్ పదేపదే అసత్యాలు మాట్లాడితే ప్రజలే చెప్పులతో కొడతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణే తమ విధానమని వ్యాఖ్యానించిన బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్పై పల్లా రాజేశ్వర్రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ ముక్త్ భారత్, మోదీ ముక్త్ భారత్ అనే నినాదంతో దేశ ప్రజలు కదులుతున్నారని చెప్పారు. సమావేశంలో వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: రవిచంద్ర
రాజ్యసభకు తనను ఎంపిక చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధికి తనవంతు పాటుపడతానని చెప్పారు. విభజన చట్టంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు గళమెత్తుతానని పేర్కొన్నారు.