Minister Dayakar Rao | పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారిలో మేమకమవుతారు. ఎక్కడికి వెళ్లినా అందరితో సరదాగా మాట్లాడడంతో పాటు యోగక్షేమాలపై ఆరా తీస్తుంటారు. అలాగే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభిప్రాయాలను తెలుసుకుంటుంటారు. అయితే, మూడేళ్ల కిందట మంత్రి సొంత ఖర్చులతో నియోజకవర్గ వ్యాప్తంగా గౌడ కులస్తులకు గిరకతాళ్లను పంపిణీ చేశారు. గీత కార్మికులు తారసపడిన సందర్భంగా గిరిక తాళ్లు ఎలా ఉన్నాయి? చెట్ల పరిస్థితి.. కల్లు వస్తుందా? అంటూ అడిగి తెలుసుకుంటుంటారు.
తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం పలు పెళ్లిళ్లకు హాజరుకావడంతో పాటు పలువురిని పరామర్శించారు. పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మూడేళ్ల కిందట మంత్రి పంపిణీ చేసిన గిరక తాళ్లకు కల్లు పారుతున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలుసుకున్నారు. గిరక తాటి వద్దకు చేరుకొని స్వయంగా చెట్టు ఎక్కి కల్లును దింపారు. ఆ తర్వాత కల్లు రుచి చూశారు. గిరక తాటికల్లుకు ఔషధ గుణాలున్నాయని, తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. గిరక తాటిచెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడేళ్ల కిందటి వరకు గిరకతాటి చెట్లను పాలకుర్తి నియోజకవర్గంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వాటికి కల్లు పారుతుందని, డిమాండ్ ఉందని మంత్రి వివరించారు.