ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పాలకుర్తి పార్టీ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేకు కట్ చేసిన మంత్రి.. పలువురికి తినిపించారు. ఈ క్రమంలోనే దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్కు తోడుగా దివ్యాంగుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ఎర్రబెల్లి వెల్లడించారు.
అర్హులైన దివ్యాంగులందరికీ ట్రై సైకిల్ ఇవ్వాలనే యోచన కూడా ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. దివ్యాంగులను అందరూ గౌరవంగా చూడాలని, వారి అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొన్న మంత్రి.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.