అమరావతి : తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా(Janagama District) దేవరుప్పుల మండలం మాధపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో రూ. 22 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, డబుల్ బెడ్ రూం(Double Bed Room) ఇండ్ల సముదాయానికి శంకుస్థాపన చేశారు.
మంత్రి మాట్లాడుతూ 75 ఏళ్లలో కాని పనులు ఈ ఏడేళ్లలో నే జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ. 1250కు వరకు పెంచిందని విమర్శించారు. దేశంలో బీజేపీ పాలన అధ్వాన్నంగా ఉందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, అనేక పథకాలు అమలు అవుతున్నాయని వెల్లడించారు.విద్యా, వైద్యం కోసం సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రూ. 7 వేల కోట్లతో మూడు విడతలుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల లను ప్రైవేట్ స్కూల్స్ కంటే గొప్పగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నసీఎం కేసీఆర్(CM KCR)కు అండగా ఉండాలని గ్రామస్థులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగవుతున్నాయని , పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ప్రజా ప్రతినిధులు, డీఈవో రాము, డీఆర్డీవో రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.