హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli ) అన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ను రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంచడం పట్ల సీఎం కేసీఆర్(CM KCR) కు కృతజ్ఞతలు, దివ్యాంగులకు ( Disabled people ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల నుంచే పెరిగిన పెన్షన్లను ఇవ్వన్నట్లు ఆయన తెలిపారు. మాట తప్పని మడమ తిప్పని కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ దివ్యాంగులకు పెన్షన్లు పెంచారని కొనియాడారు.
పెంచిన పెన్షన్ ప్రకారం రాష్ట్రంలో 5,11,656 మంది దివ్యాంగులకు మేలు జరుగనుందని పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.4,016 చొప్పున నెలకు 205.48 కోట్లు అందనున్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు 28,81,222 కొత్త పెన్షన్లు మంజూరు చేసిన ప్రభుత్వం గత 9 ఏళ్లలో 60 వేల 562 కోట్ల 40 లక్షల రూపాయలను పెన్షన్లుగా అందజేసిందని వివరించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు దివ్యాంగులకు కేవలం రూ.500 మాత్రమే అందేవని గుర్తు చేశారు. సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి, పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నవంబర్ 2014లో ఆసరా పింఛను పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని వివరించారు.
ఆసరా ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, హెచ్ఐవి-ఎయిడ్స్ బాధితులు, నేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులకు, డయాలిసిస్ బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.