Damodara Raja Narasimha | ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. జోగిపేట బస్టాప్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి ఛార్జీలు లేకుండా రాష్ట్రమంతా పర్యటించవచ్చని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకానికి అందజేస్తున్న డబ్బులను సైతం రెట్టింపు చేశామని ఇకపై ప్రతి పేదవాడికి రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. నియోజకవర్గంలో త్వరలో మరొక 50 పడకల దవాఖానను నిర్మించి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషిచేస్తానని ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, సీఈవో ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్టీసీ ఆర్ఎం ప్రభులత, మేనేజర్ ఉపేందర్, ఆర్డీవో పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు.