Medak | గ్రామాల అభివృద్ధినే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టీ లింగంపల్లి, మర్పల్లి, ఆర్ ఇటిక్యాల, జగిర్యాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన దళిత కాలనీల్లో తాగునీరు, మురికి కాలువలు, విద్యుత్ స్తంభాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ధరణి తీసివేసిన తర్వాత భూమి సమస్యలు తీర్చి, భూమిపై హక్కులు కల్పిస్తామన్నారు.
మానవతా దృక్పథంతో ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.50వేల ఇద్దరికీ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ మండలం రేగొడులో కస్తూరీబా గాంధీ బాలిక విద్యాలయం, మోడల్ స్కూల్, కళాశాలలో జరిగిన సమావేశంలో దామోదర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడపిల్లలకు చదువు ఆయుధమన్నారు. చదువుతో సంస్కారం అలవడుతుందన్నారు.
మంచి నడవడి, మంచి ఆలోచనలు చదువు ముఖ్యమన్నారు. చదువుకొని సమాజంలో బాధ్యతగా ఉండాలన్నారు. ప్రశ్నిచడం అనేది చదువుతో వస్తుందన్నారు. మాతృభాషలో ప్రేమతో ఉండాలన్నారు. ఇతర భాషలను గౌరవించాలని, సబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం రూ.85లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, డీఈఓ రాధా కిషన్, మెదక్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ పాల్గొన్నారు.