హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా హాస్పిటల్కు కొత్త భవనం నిర్మించాలని ఆ దవాఖాన పరిధిలోని ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా దవాఖాన నిర్మాణంపై దవాఖాన పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. వివరాలను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియజేస్తుందని చెప్పారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే నూతన భవన నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. దవాఖాన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని స్పష్టంచేశారు.
2015లోనే కొత్త భవనానికి ఆదేశం
సీఎం కేసీఆర్ 2015లోనే ఉస్మానియాను సందర్శించి, కొత్త భవన నిర్మాణానికి ఆదేశించినట్టు మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. నిర్మాణం కూల్చవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో వేసిన కమిటీ సైతం దవాఖాన అవసరాలకు ఆ భవనం పనికి రాదని చెప్పిందని గుర్తుచేశారు. హైకోర్టు తుదితీర్పు మేరకు కొత్త భవన నిర్మాణం త్వరలో చేపడుతామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్పై ఒత్తిడిని తగ్గించడంతోపాటు ప్రజల భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే నాలుగు టిమ్స్, నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, వాణీదేవి, రహమత్ బెగ్, హసన్ ఎఫెండి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, దానం నాగేందర్, గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.