బాసర, మార్చి 24 : బాసర ఆలయ పునర్నిర్మాణాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గర్భగుడి విస్తరణ, ప్రాకార మండపం వెడల్పు, రాజగోపుర నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4.30 గంటల నుంచే శ్రీ పీఠం నాచగిరి మధుసూదనంద సరస్వతీ స్వామి సమక్షంలో వివిధ పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు.
మాస్టర్ ప్లాన్ను కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామని, ఆమోదం పొందగానే 15 రోజుల్లో టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. మొదటి విడుతలో రూ.100 కోట్లతో పనులు ప్రారంభమవుతాయని, ఇప్పటికే రూ. 50 కోట్ల నిధుల్లో రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాలను నిర్మించినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ.42 కోట్లు అందుబాటులో ఉండగా, మరో రూ.50 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఆయన ఆలయ అధికారులు, అర్చకులు, ఇంజినీర్లతో కలిసి మాస్టర్ ప్లాన్ను పరిశీలించి అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఈవో విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.