(నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని చూసి దేశం ఆశ్చర్యపోతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నాందేడ్ సభ కోసం మొదట్నుంచి విశేషంగా కృషి చేస్తున్న మంత్రితో ‘నమస్తే తెలంగాణ’ ముచ్చటించింది. ప్రతిచోటా బీఆర్ఎస్కు అనూహ్య స్పందన వస్తున్నదన్న ఇంద్రకరణ్రెడ్డి సభ ఏర్పాటుతో సహా పలు విషయాలపై విపులంగా మాట్లాడారు.
నాందేడ్ ప్రజలు ఏమనుకుంటున్నారు?
నాందేడ్ పట్టణవాసులతోపాటు, జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధితో తమ అభివృద్ధిని పోల్చిచూసుకుంటున్నారు. తెలంగాణ ప్రభు త్వ కార్యక్రమాలన్నింటిని పరిశీలిస్తున్నారు. అనతికాలంలోనే కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో వచ్చిన మార్పులను ఎవరికివారుగా వివరిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమకూ తెలంగాణ తరహాలో పింఛన్లు, రైతుబంధు, బీమా పథకాలు కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్కు నాందేడ్లో అనూహ్య స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం రైతాంగంలోకి ఊహించని రీతిలో చొచ్చుకుపోతుండటం ఆనందంగా ఉన్నది.
తెలంగాణ పథకాలపై ఎవరైనా ప్రస్తావించారా?
దాదాపు 15 రోజులుగా నాందేడ్లో విస్తృతంగా తిరుగుతున్నాను. కిన్వట్, ధర్మాబాద్, భోకర్తోపాటు ఇతర నియోజకవర్గాల్లో కలియతిరిగా. అక్కడి రైతులు, వృద్ధులతో మాట్లాడా. కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న మొదలు అనేక పథకాలపై సుదూరంలో ఉన్న ఇక్కడి ప్రజలందరికీ తెలుస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. మాకంటే ముందుగా కేసీఆర్ పేరు చెప్పగానే సార్ ప్రవేశపెట్టిన పథకాలను వారే చెప్పుకుంటూ పోతున్నారు. బీఆర్ఎస్పై ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.
సభ ఏర్పాట్లను వివరిస్తారా?
ఇది చరిత్రాత్మక సభ. బీఆర్ఎస్ పార్టీగా మారిన అనంతరం తెలంగాణ రాష్ర్టానికి వెలుపల సీఎం కేసీఆర్ నిర్వహించనున్న, ప్రసంగించనున్న మొదటి సభ. నాందేడ్ ప్రజలే కాదు, దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక సభకు దాదాపు 20 నుంచి 25 వేల మందికి పైగా తరలివచ్చే అవకాశమున్నదని అంచనా. గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో అవసరమైన సన్నాహాలు చేశాం. ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్తోపాటు నిర్మల్, నిజామాబాద్ నుంచి పార్టీ నేతలు, శ్రేణులు సభకు తరలివచ్చే అవకాశముంది.
ఎవరెవరు పార్టీలో చేరనున్నారు?
ఎవరూ ఊహించని రీతిలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలుంటాయి. ఇప్పటికే సరిహద్దు గ్రామాలకు చెందిన పలువురు సర్పంచ్లు చేరిపోయారు. నేటి సభలో పదుల సంఖ్యలో సర్పంచ్లు, నాందేడ్ జిల్లాకు చెందిన బీజేపీ, శివసేన, కాంగ్రెస్కు చెందిన కీలక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు చేరనున్నారు. ఇక సరిహద్దు గ్రామాల ప్రజలైతే తెలంగాణ తరహా పాలన కావాలంటూ, బీఆర్ఎస్ వెంట నడుస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
నాందేడ్లోని గ్రామాల్లో మీరేం గమనించారు?
ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ఏర్పాటు కు పూర్వం తెలంగాణ పల్లెలు ఎట్లా ఉన్నా యో ఇక్కడ అంతకంటే దయనీయంగా ఉన్నా యి. మౌలిక సదుపాయాలు లేక అల్లాడిపోతున్నాయి. ఇక్కడ ఎవరిని కదలించినా తాగు, సాగునీరు కరువు, కరెంటు కోతలపై ఏకరువు పెట్టుకుంటున్నారంటే వారు ఎంత దుర్భర స్థితిలో జీవిస్తున్నారో తెలిసిపోతున్నది. అన్నివర్గాల కంటే మరీ ముఖ్యంగా రైతాంగం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది.