విద్యానగర్, మే 13 : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్లోని వన్ ప్రైవేట్ దవాఖానలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన రైతు చికిత్స పొందుతుండగా, అతడిని పరామర్శించేందుకు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్లారు. దవాఖానలోని లిఫ్ట్ ఎకి మూడో ఫ్లోర్కి వెళ్లగానే ఒక్కసారిగా కేబుల్ తెగి లిఫ్ట్ కింద పడిపోయింది. మంత్రికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఆయన దవాఖాన యాజమాన్యంపై మండిపడ్డారు.
ఆసిఫాబాద్ టౌన్, మే 13 : ఓ వృద్ధురాలు ఏడాదిన్నర వయస్సు గల మనుమడితో బస్సు ఎక్కుతుండగా మరో బస్సు వచ్చి ఢీకొనడంతో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బస్స్టాండ్లో బుధవారం చోటుచేసుకున్నది. పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన వృద్ధురాలు తన మనుమడు తరుణ్ (18నెలలు)తో కాగజ్నగర్ వెళ్లేందుకు ఆసిఫాబాద్ బస్టాండ్లో బస్సు ఎకుతుండగా ఉట్నూర్ డిపోకు చెందిన మరో బస్సు రివర్స్ తీసుకుంటుండగా రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు. దీంతో బాలుడు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడు.