మహబూబ్నగర్ : వర్షాలు తగ్గిన వెంటనే మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. గతంలో కంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. పాలమూరును సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు.
అలాగే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.