హైదరాబాద్, జనవరి 26 : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆరుబయట, వరండాల్లో ఈగలు, దోమల మధ్య మధ్యాహ్న భోజనం భుజించే బాధ తప్పనున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 2,500 ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు, కిచెన్ షెడ్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డైనింగ్ హాళ్ల నిర్మాణానికి రూ.700 కోట్లు, కిచెన్షెడ్లకు రూ.100 కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రభుత్వ గురుకులాల్లో మాదిరిగానే వీటిని సకల సౌకర్యాలతో, ఒకేసారి వంద మంది విద్యార్థులు భుజించే విధంగా నిర్మించనున్నారు. స్టీల్కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయనున్నారు. కిచెన్షెడ్లతో డైనింగ్హాళ్లను అనుసంధానం చేస్తారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా 9,123 పాఠశాలను సమగ్రంగా మార్చేందుకు రూ.3,497 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. వీటిలో రూ.904 కోట్లను అదనపు తరగతి గదులు, ప్రహరీగోడలు, గ్రీన్ చాక్పీస్ బోర్డుల కోసం కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.2,800 కోట్ల నిధులను సిద్ధంచేసింది. ఆర్థికశాఖ మంజూరు లభించిన తరువాత సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు ఎంపికచేసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లకు విడుదల చేస్తారు. ఆ తరువాత ఎస్ఎంసీలు.. కాంట్రాక్టర్లు, గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. పనుల ప్రారంభానికి మొదటి విడుతగా 15 శాతం నిధులను రివాల్వింగ్ ఫండ్గా మంజూరుచేస్తారు.
మన ఊరు- మన బడిపై విస్తృతస్థాయి సమావేశాలు
మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రజలు, పాఠశాల యాజమాన్య సంఘాల భాగస్వామ్యాన్ని కాంక్షిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి సదస్సులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యేలకు లేఖలు రాయనున్నట్టు సమాచారం. కొవిడ్ తీవ్రత తగ్గిన తరువాత నిర్వహించే ఈ సదస్సుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, ఫీజుల నియంత్రణ చట్టం రూపకల్పను అవసరమైన సూచనలు, సలహాలను తల్లిదండ్రుల నుంచి స్వీకరించనున్నారు.