దుబ్బాక, మే 25 :
కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యగా దుబ్బాకలో రూ.75లక్షలతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్ కేంద్రం ఏర్పాటు కోసం మంగళవారం ఆయన సంబంధిత వైద్యాధికారులతో చర్చించారు. అనంతరం ఆయన దుబ్బాక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు వివరాలను వెల్లడించారు. కరోనా బాధితులకు మెరుగైనా వైద్యం అందించేందుకు దుబ్బాకలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ కోసం పట్టణాలు, జిల్లా దవాఖానలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారిందన్నారు. దుబ్బాకలో నిర్మించిన వంద పడకల దవాఖానలో త్వరితగతిగా ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో రోజుకు వంద మంది కరోనా రోగులకు సరిపడే ఆక్సిజన్ అందిస్తారని వివరించారు. కరోనా వైరస్ను కట్టడి చేయడంతో పాటు కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు.
ఎంపీ ప్రత్యేక చొరువతో దుబ్బాకకు ఆక్సిజన్ కేంద్రం..
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరువతో దుబ్బాకలో రూ.75లక్షలతో డియోగో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నందున దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాస్, ఏఎంసీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు ఎంపీ ప్రభాకర్రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాకలో నిర్మించిన వంద పడకల దవాఖాన భవనంలో మంగళవారం ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు సంబంధించిన పనుల కోసం కాంట్రాక్టర్ దేవిరెడ్డితో స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు.