హైదరాబాద్ : తెలంగాణ క్యాబినేట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది . ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్, మంత్రుల ఫ్లెక్సీలకు పాలభిషేకం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మెట్రో (Metro ) విస్తరణపై ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగర నలుమూలల మెట్రో విస్తరణ కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలుపడం పై యూసుఫ్ గూడా కూడలి లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ( CM KCR ) ఫ్లెక్సీకి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ (RS RTC) ని ప్రభుత్వంలో విలీనం (Merger) చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులచే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికులు సన్మానించి పటాకులు కాల్చారు. వికారాబాద్ జిల్లాలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.