హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. సోమవారం హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగామ, వరంగల్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసినట్టు వెల్లడించింది. కొద్దిసేపటికే కురిసిన ఈ భారీ వర్షానికి రోడన్నీ జలమయం కావడంతో, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపింది.
రోడ్లపై మోకాళ్లల్లోతు వర్షపు నీళ్లు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడి, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని పేర్కొన్నది. ఈనెల 25న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా, 26,27 తేదీల్లో క్లౌడ్బరస్ట్లతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వివరించింది. కాగా, గడిచిన 24గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు -ఎంలో 14.26 సెం.మీ, ఆత్మకూరులో 9.71 సెం.మీ, మెదక్ జిల్లా అల్లాదుర్గ్లో 11.13 సెం.మీ, మహబూబాద్ జిల్లా పెద్దవంగరలో 9.59 సెం.మీ, జనగామ జిల్లా దేవరుప్పలలో 9.34 సెం.మీ, వికారాబాద్ జిల్లా కులకచర్లలో 8.94 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు
వెల్లడించింది.