న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. పరీక్షల సమయంలో, ఫలితాల అనంతరం పాఠశాల విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నట్టు ఇటీవలి సర్వేలో వెల్లడైంది. పిల్లల్లో మానసిక సమస్యలను ముందే గుర్తించి నివారించేందుకు ప్రతి పాఠశాలలో లేదా స్కూల్ సమూహాల్లో మానసిక ఆరోగ్య సలహా మండలిని హెచ్ఎం/ ప్రిన్సిపాల్ నేతృత్వంలో ఏర్పాటుచేయాలని ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల్లో సూచించింది.
మండలిలో టీచర్లతోపాటు తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులను సైతం సభ్యులుగా నియమించాలని తెలిపింది. పాఠశాల స్థాయిలో మానసిక ఆరోగ్య కార్యక్రమం కోసం ఏర్పాటయ్యే ఈ మండలి విద్యార్థులకు అన్ని అంశాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నది. విద్యార్థుల ప్రవర్తనను గమనించడం, నిరాశ, ఆందోళనలను గుర్తించడం, అవసరమైన చికిత్స అందించడం లేదా వైద్యసలహాలకు సిఫారసు వంటివి మండలి చేయాల్సి ఉంటుంది.