బహుమతులు వచ్చాయంటూ సైబర్ నేరగాళ్ల మెసేజ్లు
రిజిస్ట్రేషన్, ట్యాక్స్ల పేరిట డబ్బులు గుంజుతున్న వైనం
అప్రమత్తంగా ఉండాలి : సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. ఇటీవల ఆన్లైన్లో దుస్తులు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ‘మీషో’ పేరిట నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా ‘మీషో’లో మీరు బహుమతులు గెలుచుకొన్నారంటూ మెసేజ్లు పంపిస్తారు. ఎవరైనా నమ్మి రిైప్లె ఇస్తే వారిని టార్గెట్ చేస్తున్నారు.
మీకు లాటరీ వచ్చిందని, గిఫ్ట్గా ఫలానా వస్తువులు వచ్చాయని ఫొటోలతో ఊదరగొడుతున్నారు. వాటిని సొంతం చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు ఫీజు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. లక్షల రూపాయల విలువైన కారు మీ సొంతం కావాలంటే రిజిస్ట్రేషన్ లేదా ట్యాక్స్ నిమిత్తం డబ్బులు చెల్లించాలంటూ అందినకాడికి డబ్బులు గుంజుతున్నారు. ఈ కొత్త తరహా మోసంపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు. ‘మీషో’ పేరిట వచ్చే లెటర్లను, వాట్సప్ మెసేజ్లను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లు వస్తే హెల్ప్లైన్ నంబర్ 1930 లేదా ‘www.cybercrime.gov.in’ లో ఫిర్యాదు చేయాలని కోరారు.