కాళేశ్వరం, మార్చి 1: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో ఎలాంటి లోపం లేదని, వరదల వల్లే మేడిగడ్డ పిల్లర్లు దెబ్బతిన్నాయని సాగునీటిరంగ నిపుణుడు వీ ప్రకాశ్ స్పష్టం చేశారు. అన్నారం బరాజ్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడారు. డిజైన్ లోపమైతే మూడు బరాజ్లలో రెండు పిల్లర్లే దెబ్బతింటాయా? అని ప్రశ్నించారు. గత 500 ఏండ్లలో ఇప్పుడు వచ్చినంత వరద ఎప్పుడూ రాలేదని, ఇక్కడ ఒక్కరోజులోనే 250 టీఎంసీల నీరు బరాజ్ పైనుంచి వెళ్లిందని, అయినా అది తట్టుకున్నదని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ వద్ద మరమ్మతు చేయక వరదల్లో కొట్టుకుపోతే కోటి మంది ప్రజలకు అన్యాయం చేసినట్టేనని, వారు ఎప్పటికీ ఈ ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు.
కేసీఆర్ ఉండి ఉంటే జనవరి నాటికే కన్నెపల్లి పంప్హౌస్ దగ్గరలో కాఫర్ డ్యామ్ కట్టి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయించి, పంటలకు నీరందించేవారని వివరించారు. ఈ ప్రభుత్వానికి రిపేర్ చేసే ఉద్దేశమే లేదని, ఇప్పుడున్న సీఎం నీళ్లకోసం, రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి కాదు, జై తెలంగాణ అన్నోళ్లను రైఫిల్ ఎత్తికొట్టినవాడని, రాజకీయంగా కోటిమందితో ఆడుకుంటున్నాడని చెప్పారు. అబద్ధాలతో నమ్మించాలని చూస్తున్నాడని విమర్శించారు. అక్టోబర్ 21న బరాజ్ వద్ద ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని, ఏ ఒక్క నిపుణుడూ పిల్లర్ల వద్ద నేటికీ దిగి కారణాలను తెలుసుకోలేదని చెప్పారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రల్లో మూడో పేజీ, ఆరో పేజీ, పదో పేజీలో కష్టాల్లో మేడిగడ్డ బరాజ్ కట్టారు.. అని ఉన్నదని, మేడిగడ్డ బరాజ్ కట్టొద్దని శ్యామ్ప్రసాద్రెడ్డి, అనంతరామ్ దామోదర్ మరో ఐదుగురు ఇంజినీర్లు నివేదిక ఇచ్చినట్టు చూపారని తెలిపారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు తప్పుగా ఇచ్చి తప్పుదోవ పట్టించినవారికి సభా ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. 1956 నుంచి 2014 వరకు అసెంబ్లీలో ఇచ్చిన శ్వేతపత్రాల్లో అయకట్టు 52 లక్షల ఎకరాలు అని చెప్పారు కానీ 35 వేల మంది రైతులు బోర్లు వేసి ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు.