సాంకేతికతను, సాధనాలను అభివృద్ధి చేసుకోవాలి
బయో ఏషియా సదస్సులో జరుగనున్న ప్రధాన చర్చ
24 నుంచి హైదరాబాద్లో వర్చువల్గా సమావేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : వైద్యపరమైన సాధనాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సాంకేతికతకు మెరుగులు దిద్దడం, వైద్య పరికరాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఏషియా వర్చువల్ సదస్సులో ఇదే విషయమై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నది. నూతన ఆవిష్కరణలతోపాటు పరిశ్రమల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సదస్సులో చర్చించనున్నారు. ఐబీఈఎఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశ అవసరాలకు కావాల్సిన వైద్య పరికరాల్లో 75-80శాతం దిగుమతి అవుతున్నాయి. ఇండియన్ మెడికల్ డివైజెస్ నివేదిక-2021 ప్రకారం, దేశంలో 2020లో వైద్య పరికరాల మార్కెట్ రూ.77,539కోట్లు (11 యుఎస్ బిలియన్లు), కాగా 2025నాటికి ఇది రూ. 3,52,450 కోట్లకు, అంటే 50 బిలియన్లకు చేరుతుందని అంచనా. దీన్నిబట్టి దిగుమతులు ఇంకా భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నిబట్టి భారతీయ తయారీదారులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఈ రంగాన్ని వృద్ధిచేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం ఈ రంగంలో దేశీయ పరిశ్రమల అభివృద్ధికిగాను వచ్చే ఐదేండ్లలో రూ. 3420 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
సదస్సులో పాల్గొననున్న ప్రముఖులు
బయో ఏషియా-2022 సదస్సులో భాగంగా మెడ్టెక్, హెల్త్టెక్ రంగాల్లో ప్రపంచ పోకడలు, అవకాశాలు, సవాళ్లపై ప్రముఖులు చర్చించనున్నారు. దేశీయ పరిశ్రమలకు దోహదపడే అంశాలు, ముఖ్యం గా టారిఫ్ పాలసీ, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ తగ్గింపు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. మెడ్ట్రానిక్ ఇండియన్ దక్షిణాసియా ఎండీ మదన్ ఆర్ కృష్ణన్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ఎండీ భార్గవ్ కొటాడియా, హిందుస్థాన్ సైరింగ్స్, మెడికల్ డివైజెస్ ఎండీ రాజీవ్నాథ్ ఈ సదస్సులో పాల్గొననున్నారు.
దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి: కేటీఆర్
వైద్య పరికరాలు, రోగ నిర్థారణకు అవసరమైన సాధనాల కోసం దిగుమతులపై ఆధారపడడం అత్యంత ఆందోళనకరం. మెడ్టెక్ రంగ అభివృద్ధి ఆవశ్యకతను ముందే గుర్తించిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, నైపుణ్యంగల టాలెంట్ పూల్, అల్ట్రామోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర చర్యలతో మెడ్టెక్ ఆవిష్కరణలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కును 302 ఎకరాల్లో ఏర్పాటు చేశాం. ఇందులో 50కిపైగా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు తగిన సౌకర్యాలున్నాయి. ఇప్పటికే ఏడు కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మెడ్టెక్ కంపెనీ మెడ్ట్రానిక్ రూ. 1200కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నది. మెడ్టెక్ పరిశ్రమ వృద్ధికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మేము చేస్తున్న కృషిలో భాగంగా ప్రముఖులను ఒక వేదికపైకి తెచ్చేందుకు బయో ఏషియా సదస్సు దోహదం చేస్తుంది. దేశీయంగా ఉత్పత్తులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు అవరోధంగా మారాయి. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.