Kotha Prabhakar Reddy | విపక్షాలకు, తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అనేక సార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల, ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ తదితరుల మాటలు, చేతలు ఏ మాత్రం బాగాలేవని, ఈ విద్వేష ధోరణి సమాజాన్ని విషపూరితం చేస్తున్నదని.. ప్రజల మనసులు కలుషితం అవుతున్నాయని.. ఇది తెలంగాణకు మంచిది కాదని కేసీఆర్ ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. ఆయన అనుమానమే నిజమైంది. అనుకున్నంతా జరిగింది. పచ్చటి తెలంగాణలో నెత్తుటి రాజకీయం మొదలైంది.
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ 13 ఏండ్ల పాటు నడిపారు. రాష్ర్టాన్ని సాధించారు. శాంతియుతంగా.. ప్రశాంతంగా! గత పదేండ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. తూటా పేలకుండా.. కర్ఫ్యూ రాకుండా! ఒకప్పుడు అనేక అలజడులతో అతలాకుతలమైన తెలంగాణను తల్లికోడి పిల్నల్ని కాపాడుకున్నట్టు.. రక్తపు చుక్క చిందకుండా కేసీఆర్ కాపాడుకుంటూ వస్తున్నారు. ఫలితంగానే గత పదేండ్లుగా శాంతికి చిరునామాగా మారింది.
ఇటువంటి తెలంగాణలో అధికారం కోసం.. కాంగ్రెస్, బీజేపీలు చిచ్చు పెడుతున్నాయని కేసీఆర్ చెప్పిన మాట నేడు నిజమైంది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. చేసింది ఒక కాంగ్రెస్ కార్యకర్త. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఒక అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం బహుశా ఇదే మొదటిసారి.
నాలుగు ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు విచ్చలవిడిగా, అడ్డూ అదుపూ లేకుండా, చిన్నంతరం పెద్దంతరం చూడకుండా వాడుతున్న భాష తెలంగాణ భవిష్యత్తుకు మంచిది కాదన్న కేసీఆర్ మాట అక్షరసత్యమైంది. నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే.. చేతికొచ్చినట్టు చేస్తామన్నట్టుగా కార్యకర్తలు తీవ్రవాదులుగా మారుతున్నారు. హత్యాయత్నంలో ప్రభాకర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గన్మన్ కాపాడటం.. సకాలంలో వైద్యసదుపాయం అందడం వల్ల ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అధికారం కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీకి అది అందని ద్రాక్షేనని అర్థమైంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ దూసుకు పోతుండడం.. కేసీఆర్దే హ్యాట్రిక్ విజయమని సర్వేలు ముక్తకంఠంతో చెప్తుండటం, టికెట్ల అమ్మకాలతో పార్టీ రచ్చరచ్చగా మారడం, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులంతా పార్టీ నుంచి వెళ్లి పోతుండటంతో రేవంత్రెడ్డి బ్యాచ్కి ఓటమి తప్పదని అర్థమైంది. ఆ నిస్రృహలోనే అది నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నది.
ఇంత జరిగినా కాంగ్రెస్కు జ్ఞానం రాలేదు. ప్రభాకర్రెడ్డిపై దాడి అంతా డ్రామా అని చూపించడానికి మొదట ప్రయత్నించి విఫలమైంది. తర్వాత దాడి చేసిన వ్యక్తి తమవాడు కాదని చెప్పడానికి అది ఫేక్ ప్రచారాలకు దిగింది. ఫొటోలు మార్ఫ్ చేసి అతడిని బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తగా చూపించడానికి ప్రయత్నించింది.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, ఓ దుండగుడు పక్కా ప్లాన్తో కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం పూర్తి చేసుకొని మరో గ్రామానికి బయలుదేరారు. సూరంపల్లి చర్చి పాస్టర్ రంగయ్య తల్లి నర్సవ్వ ఇటీవల చనిపోయిన విషయం తెలుసుకొన్న ఎంపీ.. వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఇంటి నుంచి తన వాహనం ఎక్కేందుకు ప్రభాకర్రెడ్డి వస్తుండగా, గటాని రాజు అనే వ్యక్తి ఎంపీ కడుపులో కత్తితో దారుణంగా పొడిచాడు. సూరంపల్లిలో ఎంపీ ప్రచారం ముగిసిన వెంటనే కవరేజీకి వచ్చిన పాత్రికేయులు వెళ్లిపోయారు. రాజు మాత్రం ఎంపీ ప్రభాకర్రెడ్డిని అనుసరిస్తూ ఫాస్టర్ రంగయ్య ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎంపీ ప్రభాకర్రెడ్డిని విష్ చేస్తున్నట్టు దగ్గరికి వచ్చి, తన ప్యాంట్ జేబులో దాచుకున్న కత్తితో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఎంపీ వ్యక్తిగత సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ఆయనను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి 1 గంట 45 నిమిషాల్లో అంబులెన్స్లో మధ్యాహ్నం 2:56 గంటలకు సికింద్రాబాద్లోని యశోద దవాఖానకు తీసుకొచ్చారు.
నారాయణఖేడ్లో సీఎం ప్రచార సభకు వెళ్తూ దాడి విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్రావు అటు వెళ్లకుండా నేరుగా దవాఖానకు చేరుకున్నారు. అంబులెన్స్లో ప్రభాకర్రెడ్డి యశోద దవాఖానకు చేరుకోగానే, దవాఖాన లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. దవాఖాన సిబ్బందిని అప్రమత్తం చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. పక్కనే ఉండి ఎంపీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
ప్రభాకర్రెడ్డికి యశోద దవాఖానలో దాదాపు 4 గంటల పాటు సర్జరీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభాకర్రెడ్డి కడుపులో చిన్న పేగుకు 4 చోట్ల గాయాలయ్యాయని, దీంతో కడుపులో రక్తం పేరుకుపోయిందని వివరించారు. అందువల్ల 15 సెంటమీటర్ల మేర కడుపును కోతపెట్టి పేరుకుపోయిన రక్తాన్ని శుభ్రం చేశామని, చిన్నపేగును 10 సెంటీమీటర్ల మేర కట్ చేశామని వెల్లడించారు. సీటీ స్కాన్, ఈసీజీ, అన్ని రకాల రక్తపరీక్షలు, ప్రి-అనస్థీషియా పరీక్షలు వంటి పరీక్షలన్నీ చేశాకే సర్జరీ చేశామని తెలిపారు. ఆయనను గ్రీన్ చానల్తో హైదరాబాద్కు తరలించి ఉండకపోతే మరింత ఇబ్బందయ్యేదని చెప్పారు.
రక్తం పేరుకుపోవటం, పేగుకు గాయాలు కావటంతో సర్జరీకి ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. ప్రభాకర్రెడ్డి దవాఖానలో మరో వారం 10 రోజులు చికిత్స పొందే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స కోసం 50-100 మంది వైద్యులు శ్రమించారని వెల్లడించారు. కత్తి పదునుగా ఉండటం వల్ల గాయం లోతు ఎక్కువగా ఉన్నదని వివరించారు. ప్రస్తుతం ఆయనకు పోస్ట్ ఆపరేటివ్ సర్జికల్ క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ, క్రిటికల్ కేర్తో పాటు మల్టీడిసిప్లినరీ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు.
మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డిని చికిత్సకు గజ్వేల్ దవాఖానకు తీసుకువచ్చిన సమయంలో ఆయన స్పృహలో లేరని డాక్టర్ మహిపాల్ తెలిపారు. బీపీ స్థాయిలు తగ్గిపోయాయని, వెంటనే చికిత్స ప్రారంభించడంతో కొద్దిసేపటికి బీపీ అదుపులోకి వచ్చిందని వెల్లడించారు. కడుపులో కత్తితో పొడవటంతో పెద్దగాయమైందని, గాయమైన చోట 5 కుట్లు వేశామని వివరించారు. రక్తం ఎక్కువగా పోకుండా చికిత్స అందించామని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ దవాఖానకు సిఫార్సు చేశామని పేర్కొన్నారు.