హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేసింది నిజమేనని అధికారులు తేల్చారు. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ నివేదిక రూపొందించారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో కలిపి 66 ఎకరాల ఒక గుంట అసైన్డ్ భూమిని ఈటల కబ్జా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అచ్చంపేట గ్రామంలో సర్వే నెం. 77, 78, 79, 80, 81, 82, 130లో భూమి కబ్జాకు గురైనట్లు విచారణలో తేలింది. కబ్జా చేసిన భూముల్లో జమున హ్యాచరీస్ షెడ్లు నిర్మించినట్లు నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు.
కొన్ని చెట్లను నరికివేసి కచ్చా రోడ్లు నిర్మించినట్లు అటవీశాఖ అధికారులు తేల్చారు. వ్యవసాయేతర భూముల మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. జము హ్యాచరీస్ భారీ ఎత్తున పౌల్ర్టీ షెడ్లు, నిర్మాణ పనులను చేపట్టారని నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని నివేదికలో వెల్లడించారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 66.1 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా, అక్రమంగా చెట్ల నరికివేత, వ్యవసాయ భూమిని అనుమతి లేకుండా వ్యవసాయేతర భూమిగా మార్చడం.. ఈ మూడు ఉల్లంఘనలు పాల్పడిన జమున హ్యాచరీస్పై చర్యలు తీసుకోవాలని నివేదికలో కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..