Summer heat | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండేఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజూ చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ్బకు గురై మృతిచెందారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మే 31 వరకు ఈ రెండు వారాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రాజధానిలో రోడ్లన్నీ నిర్మానుష్యం
అధిక ఉష్ణోగ్రతలకు భయపడి జనం బయటకు రావటం లేదు. జంట నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత భారీగా పెరుతున్నది. నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా హైదరాబాద్ రోడ్ల పరిస్థితి తయారవుతున్నది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల సమయంలో గ్రేటర్లో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోవదవుతుంటే మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల 19 నుంచి వేడి వాతావరణంతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నాగరత్న చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల ఉంటుందని తెలిపారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బకు బుధవా రం ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా తోర్రూరు మండలం గుర్తూరులో మత్స్యకారుడు పెసర రాజు(30) స్థానిక పెద్ద చెరువులో చేపల వేట కు వెళ్ళి వడదెబ్బకు గురయ్యాడు. గమనించిన స్థానికులు ప్రైవేటు దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మరో ఘటనలో వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన పావని (28) కూలీ పనులకు వెళ్లింది. తీవ్రమైన ఎండకు, వడగాడ్పులకు అస్వస్థతకు గురైంది. వాంతులు, విరోచనాలు కావటంతో చికిత్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలొదిలింది.
ట్రాన్స్ఫార్మర్, కారు దగ్ధం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని గున్నెపల్లి శివారులో వ్యవసాయ మోటర్ల కోసం ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ బుధవారం ఎండ తీవ్రతకు ఇన్సులేటర్ పగిలి ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి. విద్యుత్తు సిబ్బంది వచ్చే సరికి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. కోరుట్ల వైపు వస్తుండగా స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో కారు ఏసీలో మంటలు రావటాన్ని గమనించి అందులోని వ్యక్తి కిందకు దిగాడు. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసి కారునుచుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల దాటాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం 43.2, ఆదిలాబాద్ 41.3, భద్రాచలం 42.8,హనుమకొండ 41, హైదరాబాద్ 39.5, మహబూబ్నగర్ 40.8,మెదక్ 40.8, నిజామాబాద్ 40.9, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.