Summer | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మండే ఎండలతో మాడు పగిలిపోతున్నది.. బయటికెళ్తే నెత్తి చుర్రుమంటున్నది.. వడగాలులు, ఉకపోత ఠారెత్తిస్తున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వివిధ జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి ఉగ్రరూపంతో ఉదయం ఎనిమిది గంటల నుంచే మొదలై సాయంత్రం దాటిన తర్వాత కూడా ఎండ వేడి ప్రభావం చూపుతున్నది. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం ఉకిరిబికిరి అవుతున్నారు. పిల్లలు, వృద్ధులు వడ గాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ సోకి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరవచ్చని, కనిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6 నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలొస్తాయని అంచనా వేస్తున్నట్టు ఐఎండీ హైదరాబాద్ విభాగం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో 46.7, నేరెళ్ల (జగిత్యాల)లో 46.7, మునగాల (సూర్యాపేట)లో 46.7, పమ్మి (ఖమ్మం)లో 46.7, కామారెడ్డిగూడెం (నల్లగొండ)లో 46.6, హాజిపూర్ (మంచిర్యాల)లో 46.5, వీణవంక (కరీంనగర్)లో 46.5, మట్టపల్లి, మామిళ్ల (సూర్యాపేట)లో 46.5, ఇబ్రహీంపట్నం (నల్లగొండ)లో 46.5, కేసముద్రం (మహబూబాబాద్)లో 46.4, ఉటూరు (నారాయణపేట)లో 46.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా భగభగలు
ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారం నుంచే సూరీడు ఉగ్రరూపం దాల్చాడు. ఫలితంగా ఏప్రిల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయింది. వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెకుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
రాష్ట్రంలో శుక్రవారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఒడ్డురామవరం గ్రామానికి చెందిన రైతు బోడ శివరాం (43) మార్కెట్ యార్డులో ధాన్యాన్ని కుప్ప చేస్తుండగా పిడుగుపడి మృతిచెందాడు. మరో రైతు గుగులోతు శ్రీనుకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కందిమల్లవారి బంజర కు చెందిన కూలి ఎరికెపల్లి పూర్ణచంద్రరావు (34) పశువులను తోలుకొని వెళ్తుండగా పిడుగుపడి మృతిచెందాడు.